గ్యారంటర్పై నేరుగా చర్యలు తీసుకోవచ్చన్న ఏపీ హైకోర్టు కీలక తీర్పు
అసలు విషయం ఏమిటి?
సాధారణంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా వ్యాపార భాగస్వాముల కోసం చాలామంది “ష్యూరిటీ” ఇస్తుంటారు. అయితే చాలామందికి ఇది కేవలం సంతకం మాత్రమే అనిపిస్తుంది. కానీ చట్టపరంగా గ్యారంటర్ కూడా అప్పు బాధ్యతను పంచుకోవాల్సిందే. రుణగ్రహీత EMIలు చెల్లించకపోతే, బ్యాంకు ముందు గ్యారంటర్ను కూడా బాధ్యుడిగా పరిగణించవచ్చని కోర్టు పేర్కొంది.
బ్యాంకు రుణాలకు ష్యూరిటీగా నిలిచే వారు ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రుణం తీసుకున్న వ్యక్తి చెల్లింపులు చేయకపోతే, బ్యాంకులు నేరుగా గ్యారంటర్లపై చర్యలు తీసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు రుణ గ్యారంటర్లకు కీలక హెచ్చరికగా మారింది.
కేసు పూర్తి వివరాలు:-
గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కంబాల వెంకట రామారావు అనే వ్యక్తి, కపిల్ చిట్ కోస్టా ప్రైవేట్ లిమిటెడ్లో సభ్యుడిగా ఉన్న ఓ వ్యక్తికి ష్యూరిటీగా నిలిచారు. తరువాత ఆ సభ్యుడు చిట్ బాకీలు చెల్లించకపోవడంతో సమస్య మొదలైంది.
దీంతో డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ రికవరీ సర్టిఫికెట్ జారీ చేశారు. ఆ సర్టిఫికెట్ ఆధారంగా గుంటూరు జూనియర్ సివిల్ కోర్టు 2025 అక్టోబరులో వెంకట రామారావు జీతాన్ని జప్తు చేస్తూ వారెంట్ జారీ చేసింది.
గ్యారంటర్ వాదన ఏమిటి?
వెంకట రామారావు తరఫు న్యాయవాది కోర్టులో ఇలా వాదించారు:
"అసలు రుణగ్రహీత చెల్లించే సామర్థ్యం ఉన్నప్పటికీ, చిట్ కంపెనీ నేరుగా గ్యారంటర్పై చర్యలు తీసుకోవడం సరైంది కాదని చిట్ ఫండ్ చట్టం ప్రకారం రికవరీ సర్టిఫికెట్ జారీ చేసే అధికారం రిజిస్ట్రార్కే ఉంటుందని డిప్యూటీ రిజిస్ట్రార్కు ఆ అధికారం లేదని జీతం జప్తు చేయడం అన్యాయమని అందుకే రికవరీ సర్టిఫికెట్ను రద్దు చేయాలని కోరారు."
చిట్ కంపెనీ ఏమంది?
చిట్ కంపెనీ తరఫు న్యాయవాది వాదన ఇలా వుంది
"రుణగ్రహీతతో సమానంగా గ్యారంటర్కూ బాధ్యత ఉంటుందని అప్పు తీర్చేవరకు ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తి బాధ్యత నుంచి తప్పించుకోలేరని డిప్యూటీ రిజిస్ట్రార్ కూడా “రిజిస్ట్రార్” నిర్వచనంలోకి వస్తారని రికవరీ సర్టిఫికెట్ చట్టబద్ధమేనని వాదించారు."
హైకోర్టు ఏమి తీర్పు ఇచ్చింది ?
ఈ కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కీలక వ్యాఖ్యలు చేశారు.
కోర్టు అభిప్రాయం ప్రకారం:
గ్యారంటర్పై నేరుగా చర్యలు తీసుకోవచ్చు.ముందుగా రుణగ్రహీతపైనే చర్యలు తీసుకోవాలన్న నిబంధన లేదు.గ్యారంటర్ జీతాన్ని జప్తు చేయడంలో తప్పులేదని అని స్పష్టం చేస్తూ వెంకట రామారావు దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్ను కొట్టివేసింది.
ఈ తీర్పు ఎందుకు ముఖ్యమంటే?
ఈ తీర్పుతో:
బ్యాంకులు, చిట్ ఫండ్ సంస్థలకు గ్యారంటర్లపై నేరుగా రికవరీ చర్యలు తీసుకునే బలం పెరిగింది.“సహాయం కోసం సంతకం చేశాను” అనే కారణం చట్టపరంగా ఉపయోగపడకపోవచ్చు.గ్యారంటర్గా నిలిచే ముందు పూర్తిగా ఆలోచించాల్సిన అవసరం ఉందని స్పష్టమైంది.
ష్యూరిటీ ఇచ్చే ముందు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు:-
✔ వ్యక్తి ఆర్థిక స్థితి తెలుసుకోండి
ఎవరికి ష్యూరిటీ ఇస్తున్నారో వారి ఆదాయం, అప్పులు, చెల్లింపు సామర్థ్యం తెలుసుకోవాలి.
✔ డాక్యుమెంట్లు పూర్తిగా చదవండి
చాలామంది చదవకుండా సంతకం చేస్తారు. అది భవిష్యత్తులో భారీ సమస్యలకు దారి తీస్తుంది.
✔ మీ జీతం, ఆస్తులు ప్రమాదంలో పడొచ్చు
అప్పు చెల్లించకపోతే బ్యాంకులు లేదా చిట్ సంస్థలు మీ జీతం, ఆస్తులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
✔ CIBIL స్కోర్ దెబ్బతినొచ్చు
అన్నింటి కన్నా ముక్యమైన CIBIL హిస్టరీపై కూడా ప్రభావం పడుతుంది.
ముగింపు
ష్యూరిటీ ఇవ్వడం చిన్న విషయం కాదు. చట్టపరంగా అది పూర్తి బాధ్యత. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పరిచయస్తుల కోసం గ్యారంటర్గా నిలిచే ముందు పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం.
